Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
DAY – 05
సంపూర్ణ కార్తీక మహాపురాణము
అయిదవరోజు పారాయణము
నవమాధ్యాయము:
యమదూతల ప్రశ్నలకు చిరునగవుమోము కలవారైన విష్ణుదూతలు యిలా భాషించసాగారు, ‘ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి?’
“ఓ యమదూతలారా! ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదలి సత్సంగమములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమతత్సరుడూ మీ యమలోక గమనానికి అర్హులు కారు.
జనక ఉవాచ: ‘వశిష్ఠా! ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన యిలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూత లెందుకూరుకున్నారు? వాళ్లు యమునికి యేమని విన్నవించారు. అన్నీ సవిస్తరంగా చెప్పు.‘
యమదూతల ఆరోపణము – యముని ఉపదేశము
‘అయ్యా పాపాత్ముడునూ, దురాచారుడునూ, నిందిత కర్మాచరణపరుడూ అయిన అజామిళుని యందలి జీవుని తెచ్చే సమయంలో – విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి, అతనిని మానుంచి విడిపించి, తమతో వైకుంఠానికి తీసికొని వెళ్లారు. వాళ్లను యెదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము‘ అని కింకరులు చెప్పినది విని, రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్నీ అవలోకించినవాడై – కింకరులారా! కించిదపి పుణ్యవిహీనోపి – ఆ ఆజామిళుడనే పాపి, అంత్యకాలాన హరి నామస్మరణమును చేయడము వలన సమస్త పాపాలనూ నశింపచేసుకుని, విష్ణుప్రియుడై, విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా – తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులనూ అగ్నిదహించునో అదే విధముగా – దుష్టాత్ములై, మహిమను తెలుసుకోలేక పోయినా – ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడి పోతాయి. ఇక, భక్తిభావముతో స్మరించినవారు కేవలము కైవల్య పథగాములే అవుతారు‘ అంటూ సేవకులను ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి – యముడు మరింత పూర్వాలోచనా పరుడయ్యాడు.
అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్రదేశములో శివార్చకుడుగా వుండేవాడు. ఆ జన్మలో కూడా స్నానసంధ్యాచరనాది రహితుడూ, దైవేతరచిత్తుడూ, దైవద్రవ్యాపహరి అయి వుండేవాడు. బ్రహ్మణుడయివుండి కూడా ఆయుధపాణియై, దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడయివుండీ కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్చావిహారాలు చేసేవాడు. బహుభాషియై యవ్వనములో వుండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రహ్మణుడుండేవాడు, అతడు దరిద్రపీడితుడై- అన్నము కొరకై పట్టణములు, పల్లెలు తిరుగుతూ – యాయవార వృత్తిని అవలంబించి వున్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకునివచ్చి భార్యను పిలిచి – ‘చాలా ఆకలిగా వుంది. సత్వరమే వంటచేయి. ముందు కాసిని మంచినీళ్లియ్యి. అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను‘ అన్నాడు. కాని, యౌవనమదాశ్రితయై వున్న ఆ యిల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ వుండిపోయింది. అందుకు కోపించిన భర్త, చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు.
తన కామపుటాలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలీ-బడలీవున్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెనూ, గృహాన్నీ వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్లి, భిక్షాటనతో బతకసాగాడు. మగడు యిల్లువదలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిణి – మగడు తెచ్చినవన్నీ సుష్ఠుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని, తాంబూల చర్వణము చేస్తూ – ఒకానొక రజకుని యింటికి వెళ్లి – ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కాని, నీతిమంతుడైన ఆ రజకుడు. ఆమె కోరిన తప్పుడుపనికి అంగీకరించకపోవడంతో – వారిద్దరికి వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంచితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణజారిణి వీధినపడి రసికులను వెతుక్కుంటూ – పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి – సురత క్రీడలకాహ్వానించింది. బ్రహ్మణుడైన వీడు – ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా – అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిణి సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై – భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు ‘తు-చ‘ తప్పకుండా బ్రతుకసాగింది.
జనక నరపాలా! ఎవరిజిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాల నాశ్రయించదో, ఎవరి చెవులు, శ్రీహరి సంకీర్తనల నాలకించవో వాళ్ల పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచి పెట్టి విష్ణువునే ధ్యానిస్తూ వుంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు! మోక్షాసక్తులను మురహరి స్మరణ మేవిధంగా సూక్ష్మమార్గమో – అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మమార్గము కూడా మహొత్కృష్ట పుణ్యప్రదాయినియై – పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసేశక్తి ఈ కార్తీక వ్రతాచరణకకు మాత్రమే వుండడము వలన, ఎవరైతే ఈ దివ్వవ్రతాన్ని ఆచరించరో, వాళ్లు నరక ప్రాప్తులవుతారని తెల్సుకో. పాపనాశనియైన ఈ కార్తీక మహత్మ్యన్ని శ్రద్దా భక్తులతో వినినప్పటికీ కూడా – వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైనవారికి – పావన హృదయంతో యీ మహత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే
నవమ, దశమ అధ్యాయౌ సమాప్తా (తొమ్మిది, పది అధ్యాయములు)
అయిదవరోజు పారాయణము సమాప్తము